అన్న గొంతులో తుప్పుపట్టిన కత్తి దించిన తమ్ముడు.. గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు ప్రయాణించి ఆసుపత్రిలో చేరిన ధీశాలి!

  • కుటుంబ కలహాలతో అన్నపై తమ్ముడి దాడి
  • రక్తమోడుతూనే బైక్‌పై ఆసుపత్రికి చేరుకున్న బాధితుడు
  • నాలుగు గంటలు కష్టపడి కత్తి తొలగించిన వైద్యులు
30 ఏళ్ల యువ వ్యాపారవేత్తపై అతడి తమ్ముడు దాడిచేశాడు. తుప్పు పట్టిన కత్తిని అతడి గొంతులో దించేశాడు. కత్తి గొంతులో దిగినా ఏమాత్రం బెదిరిపోని బాధితుడు గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు దూరం ప్రయాణించి ఆసుపత్రిలో చేరాడు. అదృష్టవశాత్తు అతడిప్పుడు కోలుకుంటున్నాడు. మహారాష్ట్రలోని నవీముంబైలో జరిగిందీ ఘటన. 

కత్తితో ఆసుపత్రికి వచ్చిన తేజాస్ పాటిల్‌ను చూసి షాకైన ఎంపీసీటీ వైద్యులు ఆ వెంటనే తేరుకుని అవసరమైన వైద్య పరీక్షలు చేశారు. ఆ తర్వాత నాలుగు గంటలు కష్టపడి శస్త్రచికిత్స ద్వారా గొంతు నుంచి కత్తిని తొలగించారు. ప్రాణాపాయం తప్పడంతో అతడిని సాధారణ వార్డుకు తరలించారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో తేజాస్ పాటిల్‌పై అతడి తమ్ముడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమ్ముడికి మద్యం తాగే అలవాటు ఉందని, స్నేహితుడితో వచ్చి తనపై దాడిచేశాడని తేజాస్ పాటిల్ తెలిపారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. తన గొంతులో కత్తి గుచ్చుకున్నా ఎలాంటి భయాందోళనలు లేకుండా ఆసుపత్రికి రావాలన్న తేజాస్ స్పృహకు ఆసుపత్రి వైద్యులు ప్రశంసలు కురిపించారు.

Navi Mumbai
Maharashtra
Knife
Crime News

More Telugu News